Friday, October 30, 2009

పాక్ లో కలకలం.. ఆనందమా? ఆలోచనా ?

ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరు తొవ్విన గొయ్యిలోకి వాళ్ళే పడతారు అని మరోసారి రుజువైనట్టుంది. మన దేశాన్ని ముక్కలు ముక్కలు గా చేయాలి అని చాలా యేళ్ళు ప్రయత్నించి అటు కాశ్మీరంలో, పంజాబ్లో, మన రాజధానిలో, సిమి లాంటి దేశద్రోహులకి అన్ని విధాలుగ సహాయం ఇచ్చి లక్షల మందిని పొట్టనపెట్టుకున్న పాప ఫలమేమో ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమం. ఇందులో మన హస్తం పెద్దగ లేదనిపిస్తుంది. అసలు అవసరమే లేదనిపిస్తుంది.

ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ల దాడి చేసాకా కొద్ది రోజులు తర్వత అమెరికా ప్రోద్బలం మీద పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గర్భం లో జన్మించింది తాలిబాన్. మొదటి పది సంవత్సరాలు డబ్బు గట్ర అంతా సి.ఐ.ఏ ద్వర వచ్చేవి. తర్వత సోవియట్లు తిరిగి వెళ్ళిపోయారు... సోవియట్ యూనియన్ చరిత్రపూటాల్లోకి జారుకుంది. ఇంక చేసేది ఏమి లేక ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఒక తరం తుడిచిపెట్టుకుపోయింది ఆ దేశం లో ఈ యుద్ధాల మూలంగ. 79 నుండి 89-90 వరకు సోవియట్ల భీభత్సం వళ్ళ దేశం చాలా చాల నష్ట పోయింది.. తర్వత ఇంకో ఐదారేళ్ళు అంతర్గత కలహాలు చెలరేగాయి. పాకిస్తాన్ సహయాం చేయడం తో అందరిని ఓడించి కాబుల్ మీద విజయపతాకం ఎగరవేసింది తాలిబాన్. ఒక "గవర్నమెంట్" కూడా స్థాపించింది. దాన్ని ప్రపంచం మొత్తం మీద అంగీకరించిన రెండే రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎంతైన సొంత బిడ్డ లాంటిది కద... అప్పుడే వాళ్ళు బమియాన్ లో ఉన్న వేల సంవత్సరాల బుద్ధ విగ్రహాలని పేల్చేసారు. యే ఒక్క దేశం కై కుయి అని అనలేదు. మన దేశం ఐతే మాటవరసకి వద్దు ఆపండి ఈ ఘోరం లాంటి కొన్ని డవిలాగులు అన్నదే తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. రెండు వేల సంవత్సరాల క్రిందట.. ఆ బుద్ధ విగ్రహాలని చెక్కినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశం లో ఓ భాగమే అని గుర్తించవారు కూడా తక్కువే!! ఏం చేస్తాం.. బుద్ధుడే ఆపలేకపోయాడు మనమెంత అని అందరు ఊరుకున్నారు. అది వేరే విషయం..

అలా అలా చిలకలు గోరికలు లా బ్రతుకుతున్న తరుణం లో.. అమెరికా మీద దాడి చేసింది అల్-ఖైదా. మరి అమెరికా ఊరుకుంటదా? ముందే ఏమి మిగలని ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకా కుమ్మేసింది. అసలు అక్కడ ఏముందని ..అదే ఏం మిగిలిందని దాడి చేసిందో నాకు ఇంత వరకు అంతు చిక్కలేదు. అలా ఘోరం గా ఓడిపోయిన తాలిబాన్ అగ్ర నాయకులని స్వయానా తన సొంత విమానం లో సురక్షితం గా తీసుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన దాడికి సహాయం చేయకపోతే వాళ్ళాని అదేలా చేస్తాం అని మెల్లిగా చెప్పేసరికి దిక్కులేక సహాయానికి ఒప్పుకుంది పాకిస్తాన్. కాని ఎంతైన తాలిబాన్ ని పుట్టించి పోషించింది కద.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అటు అమెరికా కి సహాయం చేస్తా అంటునే ఇటు వీళ్ళకీ సహాయం చేసేది. రెండు వేరు వేరు దిక్కుల్లో పొయే గుఱ్ఱాల మీద ఒకటే సారి స్వారీ చేస్తే ఎల ఉంటదో తెలుసుకుందాం అని చేసినట్టు ఉండేది. రెండు చెరో దిక్కు వెళ్ళిపోయి నడ్డి ఇరిగినట్టు ఉంది ఇప్పుడు. "ఉగ్రవాదం మీద యుద్ధం" లో మొదటి ఐదేళ్ళు అస్సలు ఏమి చేయలేదు పాకిస్తాన్. కాని ఇలా తాలిబాన్లకి కూడా సహాయం చేయడం అమెరి"కనుల"కి తెలీకుండ ఉంటద? తెలుసుకున్నారు... ఇలా చేస్తే పెట్టే భిక్ష ఆపేస్తాం అన్నారు. జడుసుకొని కొంచం భయపెట్టాలని ప్రయత్నించింది పాకిస్తాన్. వజీరిస్తాన్ మీద దాడులు చేసింది.. NWFP (North West Frontier Province) మీద దాడులు చేసింది.. అమెరికా చేసిన దానికంటే పాకిస్తాన్ చేయడం వలన కోపం వచ్చింది తాలిబాన్ కి. ఆ మాత్రం ఉండదు? సొంత వళ్ళే అంటే కోపం రాదు మరి?

ముందు ఆఫ్ఘనిస్తాన్ వలయం లోకి మెల్లగా లాగింది అమెరికా ని. పాపాం వాళ్ళకి తెలీదు కద ఆఫ్ఘనిస్తాన్ గురించి.. ఇర్రుక్కున్నారు. అలెక్సాండరే భయపడ్డాడు ఆఫ్ఘన్లని చూసి. చెంఘిస్ ఖాన్, సోవియట్లు ఎవ్వరు నిలదక్కుకోలేకపోయారు .. అలాంటి చోట ఇరుకున్నారు అమెరికన్లు. గత ఐదేళ్ళలో చాలా భాగం మళ్ళా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేసింది. కాని ఇటు పాకిస్తాన్ సైన్యం వళ్ళ చాల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్ళా దృష్టి పాకిస్తాన్ మీదకి సారించారు. NWFP, వజీరిస్తాన్ లో పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగింది. స్వాట్ లోయలోకి వచ్చి పాక్ సైన్యం తో ఢీ కొట్టింది. తర్వత ఒక రోజు అమెరికా విమానం తో పాక్ తాలిబాన్ అధ్యక్షుడ్ని చంపేసింది. దానికి ప్రతీకారం గా కొత్తగా ఎన్నికైన తాలిబాన్ నాయకుడు మొదలెట్టిన ప్రతీకరమే ప్రస్తుతానికి పాకిస్తాన్ తో రగులుతున్న భీభత్సం.

ఈ సంవత్సరం కనీసం 500 మంది బలి అయ్యారు అడపా దడపల బాంబుల వళ్ళ. ఇన్నేళ్ళు మన మీద సాగించిన కుట్ర ఎల ఉంటదొ ఇప్పుడిప్పుడే అర్థం ఔతున్నట్టు ఉంది వాళ్ళకి. ఇంటి బయటకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అన్న భయం వచ్చింది పాకిలకి. వాళ్ళ పరిపాలకులకి కూడా ఆ భయం వస్తే బాగుంటుంది. మొన్నామధ్య ఏకంగా ఆర్మీ హెడ్క్వాటర్ మీదే దాడి చేసారు. మన ప్రమేయం ఏమీ లేకుండా పాక్ ఇలా ఔతోంది అంటే ఎక్కడో కొంచం ఆనందం గా ఉంది. ఈ యుద్ధం సాగుతునే ఉంటుంది.. గెలుపు రుచి చూసారు తాలిబాన్లు పాకిస్తాన్ మీద. వజీరిస్తన్, NWFP లో వాళ్ళదే రాజ్యం ఇప్పుడు. మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసారు అక్కడ. అందుకే మిగితా పాక్ ని అల చేయాలి అని ఆశ పడుతున్నారు. అల జరిగితే మనకి నష్టమే కష్టమే. కాని ఎప్పటి వరకు ఐతే పాక్ సైన్యం ప్రభుత్వం ఈ యుద్ధం కొనసాగిస్తుందో అప్పటి వరకు మనకి ఢోకా లేదు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి...

Read more...

Friday, October 23, 2009

ఆనందం ఆనందం ఆయే...

ప్రదేశం: హైదరాబదు లో ఓ గృహం
సమయం: అసురసంధ్య వేల

అప్పుడే ఆగిన ఓ కారు.. అందులోనుండి దిగిన కొంత మంది గేటు దాటుకొని ఇంట్లోకి ప్రవేసించారు. ఇంట్లో చుట్టూర్త జనం. కనీసం ఓ ముప్పై మంది ఉంటారు. అందరూ ఆ కార్లోనుండి దిగిన వ్యక్తినే చూస్తున్నారు తదేకగ. అతడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా గోల సద్దుమనిగింది.. ఎవరో అన్నారు - అమ్మాయిని బయటకి తీసుకొనిరండి అని.. వెంట్టనే.. అంటే ఓ పది నిమిషాలు తర్వత అమ్మాయి బయటకి వచ్చింది ఇంకో ఐదారు మందితో. ఇప్పుడు అందరు దృష్టి అమ్మాయి మీద ఉంది.. తనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో ఎవరో అన్నారు వాళ్ళిదర్నే మాట్లాడుకోనివ్వండి అని. అంతే ఒక్క క్షణం లో అందరు మాయమైపోయారు.. అబ్బాయి అమ్మాయి వైపు చూసి.. మీకు మీకు వంట వచ్చా అని అడిగాడు .. మొదటి ప్రశ్న ఎవడైన అది అడుగుతాడా?.. ఆ పర్లేదండి అన్నది అమ్మాయి.. తర్వతా ఇంక ఎదో అడగబోయాడు...

కట్ కట్ కట్.. చస్ .. ఇదేదో ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన మూవీలో సీన్ లా ఉంది...

ప్రదేశం: బిర్లా మందిర్ ప్రాంగణం
సమయం: అసురసంధ్యవేల

నీటుగా టై కూడా కట్టుకొని క్రాఫ్ చేసుకున్న జుత్తుతో ఉన్నాడు అబ్బాయి. మొహం లో ఎక్కడలేని టెన్షన్. మొదటిసారి ఇంటర్వ్యూ కి వెళ్ళ్తున్నవాడిలా ఉన్నాడు చూట్టానికి. ఆరు గంటలకి కలుద్దాం అని చెప్పినా ఎందుకైన మంచిందే అని ఐదున్నరకే వచ్చేసారు అబ్బయి పట్టుపట్టడం తో. సీన్ కట్ చేస్తే...

అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఓ మెట్టు మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అందరు మధ్యలో ఎందుకులే అని ఇద్దర్నే వదిలేసి ఆ వెంకన్న దర్శనానికి వెళ్ళారు. అమ్మాయి హాయిగా ఉంది.. అబ్బయేమో కొంచం ఇబ్బందిగ కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాకుండా బిక్కు బిక్కు మంటు నలుదిక్కుల హైదరాబదు ట్రాఫిక్ చూస్తున్నాడు. ఇంతలో అమ్మాయి అడిగింది... మీకు వంట వచ్చా? అని.. ఎదో while loop లో ఇరుకున్న అబ్బాయి ఆలోచనలకి break పడినట్టు ఈ లోకానికి మళ్ళా వచ్చేసాడు. పాకం పురుష లక్షణం.. రాకుండ ఎలా అండి అన్నాడు. హమ్మయ్య ఓ పని తగ్గింది అనుకుంది అమ్మాయి. మీకు బండి నడపడం వచ్చా అని అడిగింది.. ఆ పోలీసుకి దొరక్కుండ నడుపుతా అన్నాడు... దొరికినా ఒక కహాని చెప్పి డబ్బు కట్టకుండా ఉంటా అన్నాడు... ఇంకే ఇదే పదివేలు అనుకుంది అమ్మాయి. ఇలా ఓ గంట బాటు పరస్పర ప్రశ్న-జవాబుల కార్యక్రమం కొనసాగింది. అప్పటికి ఇద్దరికి కొంచం అవగాహణ వచ్చింది.. సరే అని అమ్మాయి ముందు చెప్పింది.. అబ్బాయి ఇంచు మించు గా ఓ కిలోమీటర్ గెంతాడు ఆనందంతో... అంతే.. మరుసటి రోజు లగ్నపత్రిక రాసేసారు..

ఇలానే జరిగిందా అంటే ఏమో మరి చెప్పలేము.. కాని బహుశా ఇలానే జరిగింటది అని నా ఆలోచన.. మన పెంకి పింకీ పెళ్ళిచూపులు. అబ్బాయి పాపం భయం భయం గా ఉన్నాడు... మన పిల్ల వాగ్ధాటి చూసి. అబ దబ జబ అని ఇప్పటికే హాస్పిటల్ లో తను పుట్టినప్పటి విషయాలనుండి చెప్పడం మొదలెట్టేసింటుంది. ఇన్ని రోజుల్లో ఇంకా నర్సరీ లోనో UKG లోనో ఉండి ఉంటుంది.. ఇంకా ఇంజనీరింగ్ ఉద్యోగం వరకు వచ్చేపాటికి ఎన్నేళ్ళూ పడతాయో అని బెంగ పెట్టుకొని ఉంటాడు. పెళ్ళి చూపుల్లో మొదటి ప్రశ్నకే అర్థం అయ్యిండాలి... కాని ఏం చేస్తాం.. లగ్గం ఆకాశం లో జరిగింటాయి అంటారు.. అదే marriages are made in heaven అని. నేను-నేనుగా అని అనుకుంటున్న పింకీ కి ఇంక నేను-మేముగ అని అనే టైం ఆసన్నమైంది.

వాళ్ళ ఇరువురికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ.. ఇంకొద్ది రోజుల్లో .. మన పింకీ పెళ్ళికూతురాయేనె...

Read more...

Saturday, October 10, 2009

క్రికెట్ తెలియనివాడు ...

అనగనగనగనగా ఒక ఊరిలో బుజ్జిగాడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు ఎలా ఉన్నా.. వాడ్ని అందరు ఇంచు మించు గా హీరో రాజా లా (మేధావి లా) చూసేవారు. అంటే ఊర్లో కష్టాలు లేకున్నా ఏదో ఒకటి చేసి కొంచం కష్టం గా దాన్ని చిత్రీకరించి ఉపాయాలు చెప్పేవాడు. అందరు వాడ్ని బాగా చూసుకునేవారు. ఊర్లో కాస్తో కూస్తో కొంచం జ్ఞానం బుద్ధి ఉన్నవాళ్ళళ్ళో ఒకడిగా అందరి అభిమానం పొందాడు. ఇలా ఉండగ పక్క ఊరునుండి ఒకడు వచ్చి బుజ్జిగాడి మేధస్సు చూసి "మామూలుగా రండి మేధవులుగా పొండి" అనే పోటికి పంపమని ఆ ఊరువాళ్ళతో చెప్పాడు. ఊరు పరువు పేరు నిలబెట్టాలి అని చెప్పి పెద్దలు నిర్ణయించి బుజ్జిగాడికి ఓ తోడు ఇచ్చి ఆ పోటి కి పంపారు.

బుజ్జిగాడు వాడి స్నేహితుడు పోటి జరుగుతున్న స్థలానికి చేరారు. మొత్తం ఇంకా అన్ని ప్రదేశాల నుండి ఓ వంద మంది వచ్చారు. అసలు పోటిల్లో పాల్గొనే అర్హత ఉందో లేదో అని ముందు చిన్న చిన్న పరీక్షలు పెట్టి మొత్తం మీద ఓ ఆరు మందిని ఎన్నుకున్నారు. ఇంక పోటిలూ ప్రారంభమైయ్యాయి. మొదటిది ఏంటంటే మూడు అగ్గిపుల్లల్తో ముప్పై మందికి మూడు రకలా వంటలు చేసి పెట్టాలి. ఇలాంటివి మన బుజ్జిగాడికి పప్పుతో పెట్టిన విద్య .. వెంట్టనే మూడు పుల్లల్ల్ని వేరు వేరు చేసి మూడు గిన్నెల కింద పెట్టి చక చక వంట చేసేసాడు. పోటిలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. రెండో పోటి ఐస్కాంతం తో ఓ కాంత ని ఆకర్షించాలి. ఇది కూడా చిల్లర పని కాబట్టి నిమిషాల్లో చేసేసాడు. ఇలా ఐదు విడతల పోటిల తర్వాత మొదటి స్థానం లో బుజ్జిగాడు నిల్చున్నాడు. ఇంక ఫలితాలు చెప్పే సమయం అయ్యింది.. అందరు ఇంక బుజ్జిగాడికే వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. బుజ్జిగాడు కూడా విజయగర్వం తో అందరికి చేతులు ఊపుతు నిల్చున్నాడు. కాని చివరి క్షణంలో ఆ పోటి విజేత విజేంద్ర వర్మ అని చెప్పేసరికి ఎనలేని నిరాశ నిస్ప్రుహతో స్ప్రుహ కోల్పోయాడు బుజ్జిగాడు. ఇంక జీవితం మీద విరక్తి కలిగి అలా అలా నడుచుకుంటు దగ్గర్లో ఉన్న అడివిలోకి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. కొద్ది రోజులు తర్వత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైయ్యాడు. అప్పుడు బుజ్జిగాడు అడిగిన ఏకైక ప్రశ్న అన్నింటిలోను తాను ముందుండగా మేధావి అనే బిరుదు మాత్రం వేరేవాడికి ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు "నీకు దైవ క్రీడ్ ఐన క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమే కారణం బుజ్జి" అని. ఆ మాటకి అవాక్కైన బుజ్జికి మించు ఇంచు గా మతి భ్రమించింది. "దేవా.. దేవాది దేవా మహాదేవా ....ఏంటి మీరంటుందేది. కొంచం వివరంగా చెప్పగలరు" అని పరిపరివిధములుగా ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు చిన్నగా నవ్వి చెప్పడం ఆరంభించాడు -

ఒకానొకప్పుడు దేవుళ్ళు దూర్వస ముని శాపము వలన వారి శక్తులు అన్ని కోల్పోయారు. అప్పుడు వాళ్ళందరు విష్ణు మూర్తిని స్తుతించగా విష్ణుమూర్తి సంతుషూటుడై వారికి వారి గతవాఇభవం చేరూకే ఒక ఉపాయము చెప్పెను. క్షేరసాగరాన్ని మదించి అందులోనుండి వెలువడిన అమ్రుతాన్ని సేవించినచో దేవుళ్ళకి వారి గత వైభవం తిరిగివచ్చునని తెలిపెను. దేవుళ్ళు ఒక్కరే ఆ సాగరాన్ని మదించలేరు కాబట్టి వారి చుట్టలైన అసురులని కూడా ఆహ్వానించిరి. అలా ఇరువురు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి మదనాన్ని ఆరంభించిరి. హాలాహలము, కామధేనువు గట్ర అన్ని వచ్చాక అమృతం బయటకి వచ్చెను. ఆ అమృతానికి దేవుళ్ళు అసురులు కొట్లాడుకోవడం ఆరంభించారు. ఆ కొట్లాటని పరిష్కరించేదానికి కనుగొనబడిన క్రీడ ఈ క్రికెట్. ఆ రోజు జరిగిన మ్యాచ్ కి అంపైర్ గా వ్యవరించినది సాక్షాత్తూ ఆ బ్రహ్మే. మధ్యలో అసురులు వీరవిపరీతం గా విజ్రుంభిస్తూంటే వారి ఆటని దెబ్బకొట్టేదానికి విష్ణుమూర్తి మోహిని గా వచ్చే సరికి ఆ సుందరిని చూస్తూ మతిచెడి అసురులు ఓడిపోయారు. అలాంటి ఆటని హేళన చేసినందుకును ఇష్టపడనందుకును నీకు ఆ బిరుదు రాలేదు.

ఇది విన్న బుజ్జిగాడికి కళ్ళు చెమ్మగిల్లాయి.. ఐతే దేవా ఈ క్రీడని తెల్లోళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? ఇది మన జాతీయ క్రీడ అవ్వాలి కద? అని అడిగాడు. అందుకు ఆ మహదేవుడి ఇలా సెలవిచ్చాడు - "భారతీయులకి ఓ భయంకరమైన జబ్బు ఉంది. అది ఎందుకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అసంధర్భం కావున చెప్పడం లేదు.. కాని ఆ జబ్బేంటంటే 'భారతీయులకి - పొరుగింటి పుళ్ళకూర రుచి! మనది, మన దేశానిది మన వాళ్ళూ అంటే చచ్చిన అవళంబించరు సరికద అపహాసం చేస్తారు. అందుకనే ఈ క్రీడని తెల్లోళ్ళకి అంటగట్టాల్సి వచ్చింది. అలా అయినా మనవాళ్ళు దీన్ని పుళ్ళకూరంత రుచిగా చూసుకుంటారని. ఇప్పుడు జరుగుతుండేది అదే కద!" ఇలా చెప్పేసరికి బుజ్జిగాడికి బోధిచెట్టుకింద కూర్చున్నంత జ్ఞానమొచ్చి ఇలా అన్నడు:

ఖగపతితోడన్ క్షీరసాగరము మదించగన్,
తగువున్ చేదించుటకు విధాత తలపుగన్,
జన్మనొందెన్ ఈ మహోనత క్రికెట్ క్రీడన్,
క్రికెట్ తెలియనివాడు దున్నపోతై పుట్టున్..

గమనిక: ఈ టపా ఎవ్వరిని ఉద్దేసించి వ్రాసినదికాదు. 'నేను-నేనుగా' యే 'నేస్తా'ల సహాయం లేకుండా రాసినది. ఎవరినైన బాధ కలిగిస్తే కేసేసుకోండి. నేను దానికి బదులుగా ముందే ఓ రెండు మూడు కేసులేసేస్తా.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP